* గీత దాటకుండా “డిజె టిల్లు” తెరకెక్కించాను – దర్శకుడు విమల్ కృష్ణ*

279

ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి ‘డిజె టిల్లు’ చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డిజె టిల్లు‘ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘డిజె టిల్లు’ సినిమా విశేషాలను దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

సినిమాలకు ముందు షార్ట్ ఫిలింస్ చేశాను. ఒకట్రెండు చిత్రాల్లో నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ ఒక మంచి కథను తెరపై చూపించాలి అని ఉండేది. ఆన్ స్క్రీన్ ఉండాలనే కోరిక తక్కువ. సిద్దూ నాకు పదేళ్లుగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్, ఎలా మాట్లాడుతాడు ఇవన్నీ చూశా. నేను కథ రాసుకున్నప్పుడు ఈ టిల్లు క్యారెక్టర్ కు సిద్ధు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సిద్ధూకు చెబితే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధూ డైలాగ్స్ రాశాడు. మేమిద్దరం కలిసి రచన చేశాం. మేము మాట్లాడుకుంటున్నప్పడే చాలా సంభాషణలు వచ్చేవి. వాటిని సినిమాలో ఉపయోగించాం. లాక్ డౌన్ ముందు రాసిన కథ ఇది. తర్వాత మాకు ఇంప్రూమెంట్ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. దాంతో వీలైనంత డీటైయిల్డ్ గా స్క్రిప్ట్ రెడీ చేశాం. నా దగ్గర ఇది కాక మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే నా తొలి సినిమా ప్రభావాన్ని చూపించాలి. జనాల్లోకి వెళ్లాలి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథతో తొలి సినిమా రూపొందించాను.

సిద్ధూ నేనూ సినిమాను చూసే విధానం ఒకేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనే విషయంలో ఇద్దరం దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా మధ్య ఎప్పుడూ క్రియేటివ్ విబేధాలు రాలేదు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా విడుదలయ్యాక నిర్మాత వంశీ గారి దగ్గర నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మా దగ్గర డిజె టిల్లు కథ సిద్దంగా ఉంది. వెంటనే వెళ్లి చెప్పాం. ఆయనకు నచ్చడంతో సితారలో సినిమా మొదలైంది. సినిమా తొలి భాగాన్ని ఎంత ఆస్వాదిస్తారో, ద్వితీయార్థాన్నీ చూస్తూ అంతే ఆనందిస్తారు.

ట్రైలర్ లో చూస్తే నాయిక చుట్టూ ముగ్గురు నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజం మహిళను ఆ సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దృక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. లోతుగా వెళ్లి చర్చిస్తే విసుగొస్తుంది. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. మేము ఎంటర్ టైనింగ్ దారిని ఎంచుకుని డిజె టిల్లు చేశాం.

ట్రైలర్ లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు కానీ సినిమాలో కథానుసారం అలా కొంత రొమాంటిక్ సందర్భాలు ఉంటాయి. కావాలని రొమాన్స్ ఎక్కడా చేయించలేదు. అది హద్దులు దాటేలా ఉండదు. సిద్దూ హైదరాబాద్ కుర్రాడు, అతనిలో డిజె టిల్లు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్ మేకోవర్ అంతా దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్యారెక్టర్ లోకి త్వరగా వెళ్లిపోగలిగాడు. నరుడు బ్రతుకు నటన అని ముందు టైటిల్ అనుకున్నాం కానీ సినిమా గురించి ఎవరికి చెప్పినా ఇది డిజె టిల్లు కదా అనేవారు. దాంతో అదే పేరును టైటిల్ గా పెట్టుకున్నాం.

టిల్లు తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటాడు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో పోల్చుకుంటాడు. హీరోకున్న ఈ క్వాలిటీ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. సినిమాలో నాయిక పేరు రాధిక. మాటల్లో..జాతీయ ఉత్తమ నటి రాధిక ఆప్తే అని సరదాగా అనుకున్నాం. అది సినిమాలో అలాగే పెట్టాం. నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు. ఏది ఎలా కావాలంటే అలాగే చేయండని ప్రోత్సహించారు. ఎప్పుడూ ఇది వద్దు అని చెప్పలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది. అలాగని డిజె టిల్లు కథను తెరకెక్కించడంలో కాంప్రమైజ్ కాలేదు. సహజంగా మా కథలోనే ఎవరికీ ఇబ్బందిలేని అంశాలున్నాయి.

త్రివిక్రమ్ గారు స్క్రిప్టు విషయంలో మంచి సూచనలు ఇచ్చారు. త్రివిక్రమ్ గారిని తరుచూ కలవడం, మీటింగ్స్ ఈ సినిమాతో మాకు దొరికిన గొప్ప జ్ఞాపకాలు.

– డిజె టిల్లు ద్వారా కొత్త టేకింగ్, ఫ్రెష్ మేకింగ్ చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యామని అనుకుంటున్నాము. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు. సినిమా కుదిరాక వివరాలు వెల్లడిస్తా.

హీరో సిద్దు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘డిజె టిల్లు’నుంచి నీ కనులను చూశానే పాట విడుదల:

సోమవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా డిజె టిల్లు చిత్రం నుంచి నీ కనులను చూశానే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రవికాంత్ పేరెపు సాహిత్యాన్ని అందిచగా సిద్ధు పాడటం విశేషం. అడ్మైరింగ్ పాటలా సాగే ఈ గీతం కథానాయకుడి ప్రేమను ఆవిష్కరించింది. నీ కనులను చూశానే, ఓ నిమిషం లోకం మరిచానే, నా కలలో నిలిచావే, నా మనసుకు శ్వాసై పోయావే అంటూ సాగుతుందీ పాట.

PRO;VENU GOPAL