ఉస్తాద్ రామ్ పోతినేని చేతుల మీదుగా అక్టోబర్ 26న ‘దీపావళి’ ట్రైలర్ విడుదల!

124

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. తమిళంలో ఆయన నిర్మించిన ‘కిడ’కు తెలుగు అనువాదం ఇది. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంత కంటే ముందు ట్రైలర్ విడుదల కానుంది.

తెలుగు చిత్రసీమలో ‘లేడీస్ టైలర్’తో స్రవంతి మూవీస్ తొలి అడుగు వేసింది. ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో ‘స్రవంతి’ రవికిశోర్ 38 చిత్రాలు నిర్మించారు. ఆయన ఎప్పుడూ కంటెంట్ ఈజ్ కింగ్ అని కథను నమ్మి సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. స్రవంతి మూవీస్ సంస్థలో 38వ సినిమా ‘కిడ’. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 26న (గురువారం) ట్విట్టర్ ద్వారా హీరో రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు.

‘దీపావళి’లో ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, అందమైన ప్రేమకథ కూడా ఉంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వెంకట్ రాసిన కథ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ‘దిల్’ రాజు ఏ విధంగా అయితే ‘బలగం’ తీశారో… ఆ తరహాలో మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’.

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.