`ఢీ` టీమ్ లాంచ్ చేసిన `సాఫ్ట్‌వేర్‌ సుధీర్` ట్రైల‌ర్!!

537

‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్‌ రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ..హీరో సుధీర్ మాట్లాడుతూ – ” మా సినిమాలోని మొదటి పాటను జబర్దస్త్ టీమ్ విడుదల చేసింది. ఇప్పుడు మా మూవీ ట్రైలర్ ను ‘ఢీ’ టీమ్ తో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా అమ్మ నాన్న లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా”అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల మాట్లాడుతూ – ” మా ట్రైలర్ లాంచ్ చేసిన చిన్ని ప్రకాష్ మాస్టర్ కి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ సాధిస్తాం” అన్నారు.

చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”మా బేనర్ లో ఫస్ట్‌ మూవీ. కథ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశాను. సుధీర్‌గారిని మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్ లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.