మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా ” రాజా నరసింహ” థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ

651

రాజా చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు! ”అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా! ఆతను చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు! జనాల్ని మోసం చేసే సాధారణ వ్యక్తినైనా, మంత్రినైనా బట్టలు లేకుండా జనాల్లో నిలబెట్టే సత్తా ఉన్నవాడు. నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. ఆ అటవీ ప్రాంతంలో సమస్యను ‘రాజా నరసింహా’ ఎలా పరిష్కరించాడు అన్నదే మా చిత్రం” అని దర్శకుడు వైశాక్‌ అన్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా ఈ నెల 22న విడుదల కానుంది. ‘మన్యం పులి’ సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు బోయపాటిశ్రీను ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ”మధుర రాజా’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్‌ అయింది. మమ్ముటీ గారి నటన అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. తెలుగులో తప్పకుండా విజయం సాధిస్తుంది. విడుదల రోజే సినిమా చూస్తా” అని అన్నారు
నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ ”చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్‌, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం, పీటర్‌ హెయిన్స్‌ పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసి ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.