లండన్ లో ‘తాల్ ‘ సంబరాలు

169

లండన్ లో ఉండి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లేలా చేయడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఎవరు ఏ హోదాలో ఉన్నప్పటికీ మూలాలు మరచిపోకుండా తెలుగు వారంతా ఒక్కటే అని చాటి చెప్పడం స్ఫూర్తినిచ్చిందని అభినందించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో సతవిస్ పట్టిదార్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన హీరో సాయి కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. లండన్ లో తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ కు తాల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అభినందించారు. తన 50 ఏళ్ళ సినీ జీవన ప్రస్థానాన్ని సాయి కుమార్ చెబుతూ తనకిష్టమైన కొన్ని డైలాగ్ లు చెప్పి కేరింతలు కొట్టించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రఘురామ్ పిల్లారిశెట్టి ని తాల్ జీవన సాఫల్య పురస్కారం తో సన్మానించారు. ఈ వేడుకలో లండన్ హై కమీషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ దీపక్ చౌదరి, పర్వతారోహకుడు అన్మిష్ వర్మ, తాల్ అధ్యక్షురాలు భారతి కందుకూరి, ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి, ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల తదితరులు పాల్గొన్నారు. ఉగాది కోసం మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన నృత్యాలను చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రదర్శించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు హారిక నారాయణన్, అరుణ్ కౌండిన్య సినీ సంగీత విభావరి ఉర్రూతలూగించింది. యాంకర్ శ్యామల, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, ఆర్ జె శ్రీవల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.