మహేష్ బాబు ‘రంగ్ దే’ చిత్ర లోని ఓ గీతం ను ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల

739

ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన రెండు గీతాలకు ఇటు సంగీత ప్రియులనుంచి, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన తరుణంలో చిత్రం నుంచి మరో గీతం వీడియో రూపంలో ఈరోజు విడుదల అయింది. చిత్ర కథానుసారం సందర్భోచితంగా సాగే ‘రంగ్ దే’ లోని ఈ గీతం వివరాల్లోకి వెళితే .

“నా కనులు ఎపుడూ కననే కనని
హృదయ మెపుడూ విననే వినని
పెదవు లెపుడూ అననే అనని
అద్భుతం చూస్తూ ఉన్నా…”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ గాత్రంలో ఈ గీతం మృదు మధురంగా, శ్రావ్యంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిత్ర కథానుసారం యూత్ స్టార్ నితిన్, ప్రధాన తారాగణం పై చిత్రీకరించిన సందర్భోచిత గీతం ఇది. ఈ గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి..

సూపర్ స్టార్ మహేష్ బాబు తమ చిత్రంలోని ఈ గీతాన్ని విడుదల చేయటం పట్ల సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ వేదికగా చిత్ర కథానాయకుడు యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్, దర్శకుడు వెంకి అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లతో పాటు చిత్రం యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా తమ సంతోషాన్ని,కృతజ్ఞతలను తెలియ చేశారు.

రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్‘ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే‘ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి