గ్రాండ్ గా ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

989

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ వేడుక కన్నుల పండుగగా జరిగింది. చిత్ర నాయకా,నాయికలు నితిన్, కీర్తి సురేష్, సుప్రసిద్ధ నిర్మాత, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సుధాకర్‌రెడ్ది, నిర్మాత ఠాగూర్ మధు,చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్‌, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,సీనియర్ నటుడు వీకే నరే్‌ష్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, అభినవ్‌ గోమటం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీమణి, గాయని మంగ్లీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడురంగులను చూపిస్తుంది సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడురంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది. సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్‌, అను. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉంది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరు. ఇందులో ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్‌లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాలకు నేను సంగీతం అందించాలి. మ్యూజిక్‌ టూర్స్‌లో ఉండడం వల్ల డేట్స్‌ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్‌లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా ‘రంగ్‌ దే’ కుదిరింది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్‌ చేసిన సినిమాల్లో డిఫరెంట్‌ సినిమా ఇది’’ అని అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘నితిన్‌, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్‌, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. లాక్‌డౌన్‌లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేనిది. దేవిగారిని ఓ ఫ్యాన్‌గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్‌ ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారు. పీసీ శ్రీరామ్‌గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్‌ ఇచ్చారు. వెన్నెల కిషోర్‌, అభినవ్‌ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేను’’ అని అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ ‘‘రిలాక్స్‌ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సెలక్టివ్‌ సినిమాలు చూడాలనుకుంటాం. ఆ కోవకు చెందిన సినిమా ఇది. ప్రేమకథని పీసీ శ్రీరామ్‌ చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరు. బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ ఇది. అను పాత్రను కీర్తి తప్ప ఎవరూ చేయలేరు’’ అని అన్నారు.

హీరోయిన్ కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ‘‘అను పాత్ర చేయగలనని నమ్మిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌. దేవి శ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో నా మూడో సినిమా ఇది. హ్యాట్రిక్‌ అవుతుందని ఆశిస్తున్నా. నితిన్‌తో నా కెమిస్ట్రీ బావుంటుంది’’ అని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు: నితిన్

నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్‌ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. ‘ఇష్క్‌’ తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉంది. డీఎస్‌పీ డైమండ్స్‌ లాంటి పాటలిచ్చారు. కీర్తి సురేశ్‌ అనగానే ‘మహానటి’ గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్‌. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్‌ హిట్‌ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము’’ అని అన్నారు.

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి