గోవాలో నితిన్ – ప్రియా ప్రకాశ్ వారియర్‌పై ‘చెక్‌’ పాట చిత్రీకరణ*

400

*‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’*
అంటూ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను చూస్తూ నితిన్‌ పాట పాడుతున్నారు. ఆమె కూడా అదే పల్లవి అందుకున్నారు.
*‘మార్నింగ్‌ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను.*
*ఫుల్‌ మూన్‌ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’*
అని నితిన్‌ పాడుతుంటే…
*‘అడ్డులకింక చెక్‌ చెక్‌… హద్దులకింక చెక్‌ చెక్‌’*
అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ శ్రుతి కలిపారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న ‘చెక్‌’ చిత్రంలోనిదీ గీతం!

యూత్‌ స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్‌’. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. ఇటీవలే ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ గీతాన్ని గోవాలో చిత్రీకరించారు.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘గోవాలో నితిన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై చిత్రీకరించిన పాటతో చిత్రీకరణ అంతా పూర్తయింది. మూడు రోజులు అందమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించారు. దీనికి కల్యాణి మాలిక్‌ మంచి బాణీ అందించారు. శ్రీమణి చక్కటి సాహిత్యం అందించగా… శేఖర్‌ మాస్టర్‌ కనుల విందైన నృత్యరీతులు సమకూర్చారు. కథానుగుణంగా సినిమాలో ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరింది. అందర్నీ అలరించేలా ఈ పాట ఉంటుంది. కథలో సందర్భం కుదరక మరో పాటకు చోటు కల్పించలేదు. ప్రస్తుతం డీటీయస్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. నిర్మాణానంతర పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలా చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించారు. యాక్షన్‌, థ్రిల్‌ మేళవించిన మంచి చిత్రమిది’’ అని అన్నారు.

సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి  

PRO; PULGAM CHINNARAYANA