పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ నుండి సందేశంతో కూడిన నృత్య గీతం ‘మై డియర్ మార్కండేయ’ విడుదల

113

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి మొదటి సింగిల్ విడుదలైంది.

ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లపై తెరకెక్కించిన ‘మై డియర్ మార్కండేయ’ పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను నృత్యరీతులు అందించారు. చిత్రం కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించబడింది. సమయం మరియు జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరూ కాలు కదిపేలా ఉంది.

మై డియర్ మార్కండేయ పాట “కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్‌బాక్స్ బ్రో” అంటూ ట్రెండీగా ప్రారంభమైంది. స్టైలిష్ అవతార్‌లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ తనదైన నాట్యంతో ఆకట్టుకున్నారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ తో కన్నుల పండుగలా ఉంది పాట.

తన చరిష్మాతో తెరకు నిండుతనం తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ రాకతో పాట ఊపందుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “మై డియర్ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో.. మళ్లీ పుట్టి భూమికి రానే రావు నిజం తెలుసుకో.. పక్క దిగి నిద్రలేచే ప్రతిరోజు పండగ చేసుకో..” అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి.

ఈ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఊర్వశి రౌతేలా తన అందం, నాట్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నిగ్ధా శర్మ ఈ పాటకు జానపద ఆకృతిని తీసుకువచ్చారు. అద్భుతంగా స్వరపరిచిన ఈ పాట సంగీత ప్రియులను కట్టిపడేసేలా ఉంది.

రామజోగయ్య శాస్త్రి తన ఉల్లాసమైన సాహిత్యంతో మనుషుల స్వభావం మరియు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రతిరోజూ ఓ పండుగలా ఎలా జీవించాలి అనే విలువైన సందేశాన్ని ఇచ్చారు. దుస్తులు దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం ఇలా ‘మై డియర్ మార్కండేయ’ పాటకు అన్నీ చక్కగా కుదిరాయి.

ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్