కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది

95

-బల్లేపల్లి మోహన్ ( సంగీత దర్శకులు, గాయకులు) తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అధ్యక్షులు (TCMA)

తెలంగాణ ఉద్యమం కోసం రాయబడ్డ జయజయహే తెలంగాణ… అనే పాట తెలంగాణ రాజకీయ నాయకుల కపట కౌగిట్లో నలిగి నలిగి చచ్చిపోయి మళ్ళీ పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. తెలంగాణ ప్రజానికం సంతోషం వ్యక్తం చేసే పరిణామం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకెత్తించిన ఈ అద్భుత గీతాన్ని అందెశ్రీ ఎంతో అద్భుతంగా రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గీతాన్ని మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గీతంగా ప్రకటించి ఈ జూన్ రెండవ తారీకు నాడు విడుదల చేస్తుండటం ఎంతో ఆనంద దాయకం. కానీ రేవంత్ రెడ్డి గారు గత పాలకుల మాదిరే చారిత్రక తప్పిదం చేస్తున్నారు. విషయం ఏమిటంటే తెలుగు సినీ జగత్తులో అద్భుతమైన పాటలని అందించిన గొప్ప సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు ఈ పాటకి సంగీతాన్ని అందించడమే ఒక పెద్ద తప్పిదం అవుతుంది.
తెలంగాణ ఉనికిని చాటుకోవడానికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన విషయం అందరికీ తెలిసిందే. పాలకులు పదవులు వచ్చేంత వరకు తెలంగాణ పదాన్ని వాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. అధికారం వచ్చాకా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కళాకారులకి తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు. నాయకులు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు, కళాకారులు, నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ప్రతీ విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతూనే ఉంది. తెలంగాణ వచ్చి పదేళ్ళు అయినా తెలంగాణ గీతాన్ని రానీయకుండా గత పాలకులు పాపం చేసారు.
ఇప్పుడు వచ్చే సమయం వచ్చినా తెలంగాణ కళాకారుడు కాని కీరవాణి గారితో సంగీతాన్ని అందించమని కోరడం నిజంగా తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఈ విషయలో తెలంగాణ ప్రభుత్వం తొందరగా మెలుకుని తెలంగాణ కళాకారులచే ఆ గీతానికి సంగీతాన్ని అందించే అవకాశాన్ని కల్పించి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవాలని అలాగే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను.

-బల్లేపల్లి మోహన్ (సంగీత దర్శకులు గాయకులు) తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అధ్యక్షులు (TCMA)

Cell : 89191 50447