గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ మిస్ కావద్దు – సురేష్ కొండేటి

134

సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ గా ఫేమస్ అయిన ‘సంతోషం’ అవార్డులు సినీ వార పత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా తెలుగు సినిమా కళాకారులకు అందించే అత్యంత పాపులారిటీ కలిగిన పురస్కారాలు. తెలుగులో ప్రారంభమైన ఈ అవార్డులను ఇప్పుడు అన్ని సౌత్ ఇండియన్ బాషల్లో అందిస్తున్న క్రమంలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అని పిలువబడుతున్నాయి. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియా లోని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు సంతోషం పత్రికాధినేత, సినిమా నిర్మాత సురేష్‌ కొండేటి. ఈ ఏడాది జరగనున్న 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు గోవాలో జరగనున్నాయి. ఎప్పుడూ హైదరాబాదు కేంద్రంగా జరిగే ఈ వేడుకలు గతంలో ఒకసారి దుబాయ్ లోనూ నిర్వహించగా మొదటి సారి గోవాలో నిర్వహిస్తున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలు జరిగే వేదికకు సంబంధించిన ఒక వీడియోను సురేష్ కొండేటి తాజాగా విడుదల చేశారు. గోవాలో అతి పెద్ద వేదికగా చెబుతున్న ఈ వేడుకల్లో పదివేల నుంచి పదిహేను వేల మందికి సరిపోయే సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు పదివేల మందికి సరిపోయేలా పార్కింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. గోవా చూడాలని అనుకున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని సురేష్ కొండేటి అన్నారు. గ్యాలరీ సీటింగ్ దాదాపు ఐదువేల మందికి ఉంటుందని, గ్రౌండ్ లో కూడా మరో ఐదు వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేయవచ్చని వెల్లడించారు. మీ అందరి ఆశీసులతో మరింత గ్రాండ్ గా ఈ వేడుక జరపనున్నామని అన్నారు. అదిరిపోయే లైటింగ్ సెట్టింగ్స్, అదిరిపోయే ప్రోగ్రాములతో గోవాలో సత్తా చాటుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ ప్రేమికులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని సురేష్ కొండేటి కోరారు.