సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన దర్శకుడు శివనాగు

117


‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ వీడియో విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నట రత్నాలు ఆడియో ఫంక్షన్‌లో శివనాగు సీనియర్‌ హీరో సుమన్‌ను తన ఆడియో ఫంక్షన్‌కు అతిథిగా ఆహ్వానిస్తే రెండు లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే! దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశా. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నా. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్‌ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్‌ టెన్షన్‌లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు.