థాంక్యూ చిత్రం అందరి హృదయల్లో నిలిచిపోతుంది: నిర్మాత ‘దిల్‌’రాజు

283


అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘థాంక్యూ’ .విక్రమ్‌కుమార్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌ నాయికలు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్‌ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘ అక్కినేని అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా వుంటుంది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్‌తో ట్రావెల్‌ అవుతాం. జోష్‌ తరువాత చైతూకు జీవితాంతం గుర్తుండే సినిమాను ఇవ్వాలని అనుకున్నాను. అది ఈ చిత్రంతో తీరింది. ఈ చిత్రం అందరి హృదయా ల్లో గుర్తుండిపోయే సినిమాగా వుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అద్భుతమైన సినిమా చూశామనే ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటికొస్తారు’ అన్నారు.

హీరో నాగచైతన్య మాట్లాడుతూ ‘అభిమానుల ప్రేమ , ఎనర్జీ చూస్తుంటే ఎంతటి కష్టమైనా చేయాలనిపిస్తుంది. ‘థాంక్యూ’ లాంటి సినిమా చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్‌ వుంటాయి. ఈ సినిమా తప్పకుండా అందరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు.ఓ మంచి టీమ్‌తో ఇలాంటి చిత్రం చేయడం ఆనందంగా వుందని దర్శకుడు విక్రమ్‌కుమార్‌ తెలిపారు. రాశీఖన్నా మాట్లాడుతూ ‘ఈ చిత్రం కథతో పాటు నా పాత్ర బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రతి సీన్‌ అందమైన పెయింటింగ్‌లా వుంటుంది. నా కెరీర్‌లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది అన్నారు. కథా రచయిత బీవీఎస్‌ రవి మాట్లాడుతూ ‘నాగచైతన్య సినిమాకు పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ చిత్రంతో కుదిరింది. చైతన్య అభిమానులు గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది. ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్‌ ల్లో అద్బుతగా నటించాడు’ అన్నారు.