భీమ్లానాయక్‌ పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ *మాతృక నుంచి బయటికొచ్చి సినిమా చేశాం! ‌-త్రివిక్రమ్‌

468

పవన్‌కల్యాణ్‌–రానా కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్‌’ చిత్రం ప్రభంజనంలా ఘనవిజయం బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. సాగర్‌.కెచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. శనివారం ఈ చిత్రం పవర్‌ఫుల్‌ సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నారు. తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘మేం తీసిన సినిమాను మీడియా భుజాన వేసుకుని జనాల్లోకి తీసుకెళ్లింది. మంచి సినిమా తీస్తే మీడియా సహకారం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నా. ‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్‌ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలన్స్‌ చేయాలి’ ఈ సినిమా రీమేక్‌ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్‌ ఇది. కథను ఎలా మార్చుకురావాలి అన్న దానిపై మా చర్చలు మొదలయ్యాయి. అడవికి సెల్యూట్‌ చేస్తూ ‘భీమ్లానాయక్‌’ క్యారెక్టర్‌ను అడవికి మరింత దగ్గర చేస్తే అతనికి జస్టిఫికేషన్‌ దొరుకుతుందనిపించింది. మాతృక నుంచి బయటకు రావడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి భీమ్లా అయినా ఉండాలి.. లేదా డ్యాని అయినా ఉండాలి… లేదంటే ఇద్దరూ ఫ్రేమ్‌లో ఉండాలి. అందుకే క్లైమాక్స్‌ వచ్చేసరికి ఇద్దరూ ఉండేలా చేశాం. ఇద్దరికీ యూనిఫామ్‌ జర్నీ ఉండాలనుకున్నాం. భీమ్లా భార్య పెరగమంటుంది. డ్యాని భార్య తగ్గమంటుంది.. సరిగ్గా గమనిస్తే ప్రతి సీన్‌కు కౌంటర్‌ ఉంటుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ నుంచి బయటకు రావడానికి ఇవన్నీ చేశాం. మాతృక గొప్ప కథ. దృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. మాతృక ప్రేమను చంపుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలన్ని చేయాలి. పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు ఆర్టిఫియల్‌గా ఉండకూడదు. అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్‌ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్‌ చేయడానికి మేం ఎక్కువ కష్టపడ్డాం. ఆ తర్వాత అన్ని ఈజీగా జరిగిపోయాయి. కరోనా ఒక్కటే మాకు గ్యాప్‌ వచ్చేలా చేసింది. అభిమానులు మెచ్చేలా పవన్‌ని తెరపై చూపించడానికి సాగర్‌ చాలా కష్టపడ్డారు. తనకి సపోర్ట్‌గా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పాం. కల్యాణ్‌గారికి తను చెప్పలేని విషయాలను వారధిలా ఉండి మేం చెప్పాం. కొవిడ్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు. ‌
మా సినిమాకు మంచి ఆర్టిస్ట్‌లు, టీమ్‌ కుదిరింది. చిన్నచిన్న పాత్రలు కూడా ఎలివేట్‌ అయ్యారు. ప్రతి ఆర్టిస్ట్‌ స్ర్కిప్ట్‌ను చదివి మేం చెప్పినదాని కన్నా బాగా నటించారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఆర్టిస్ట్‌ల్లో చాలా పర్ఫెక్షన్‌ ఉంది. న్యూ జనరేషన్‌ ఆర్టిస్ట్‌లు ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తులని అర్థమవుతోంది. ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నా. ఇక డాన్స్‌ల విషయానికొస్తే గణేశ్‌ మాస్టర్‌ స్టెప్పులు బాగా కంపోజ్‌ చేశారు. 600 మందితో సాంగ్‌ షూట్‌ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్‌ షూట్‌ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి వెళ్లగానే అంతమంది జనాన్ని చూసి భయంవేసింది. కానీ మూడు రోజుల్లో ఆ సాంగ్‌ పూర్తి చేశారు. సాగర్‌కు వచ్చిన ఐడియాతోనే మొగిలయ్యతో టైటిల్‌ సాంగ్‌ పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం.. ఎంతో ఆనందం కలిగించింది. జానపద కళాకారులతో అనుకుని పాడించలేదు. అలా కుదిరాయంతే. తమన్‌ నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు’’ అని త్రివిక్రమ్‌ అన్నారు.

హారానికి దారంలాగా.. పనిచేశారు: సాగర్‌.కెచంద్ర
‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌ అనుకున్న తరువాత మొదటిసారి త్రివిక్రమ్‌గారిని కలిసి నప్పుడు ఎలా చేద్దాం అనే మాటలు మొదలయ్యాయి. ఇది రీమేక్‌ అనే విషయం మర్చిపోయి.. మన సినిమా రీమేక్‌ రైట్స్‌ వేరేవాళ్లు కొనాలి అనేట్లుగా చేద్దాం సాగర్‌’ అని అన్నారు. హారానికి దారం.. అన్నట్లు మా అందరినీ కలుపుకొని.. కథకు ఏం కావాలో… సాంకేతిక నిపుణులు ఎవరైతే బెస్ట్‌ అని చూసి ఈ సినిమాకు దారంలా పని చేశారు త్రివిక్రమ్‌గారు. సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారు. కథలోకి వెళ్లి దానికి ఎలాంటి సంగీతం కావాలో అర్థం చేసుకుని మ్యూజిక్‌ అందించారు తమన్‌. సంయుక్త మీనన్‌ క్లైమాక్స్‌లో తన పాత్రతో సిక్సర్‌ కొట్టారు. ఈ సినిమా సక్సెస్‌ రీ సౌండ్‌కి కారణం త్రివిక్రమ్‌గారి ఆలోచనే. సినిమా రెస్పాన్స్‌, కలెక్షన్‌ రిపోర్ట్స్‌ చూశాక చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన చినబాబుగారు, నాగవంశీ గారులకి థ్యాంక్స్‌’’ అని అన్నారు.

భీమ్లానాయక్‌ .. వైల్డ్‌ ఫైర్‌ లాంటిది: తమన్‌
పవన్‌కల్యాణ్‌–త్రివిక్రమ్‌ గార్ల కాంబినేషన్‌లో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. భీమ్లానాయక్‌’ పెద్ద తుపాను అవుతుందని మా అందరికీ తెలుసు. సినిమా విడుదలకు ముందు ఎన్నో కామెంట్లు విన్నాం. వాటికి సమాధానం చెప్పడానికి ఏడు నెలలుగా ఎంతో శ్రమించి ఈ నెల 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా సంకల్పం గొప్పది. అందుకే పెద్ద కమర్షియల్‌ హిట్‌ అయింది. భీమ్లానాయక్‌’ ఓ మధురమైన ప్రయాణం. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి ఎంతో స్వేచ్చ, సహకారం అందించారు. ఈ సినిమాకి నేను పిల్లర్‌ అంటున్నారు. కానీ ఆ పిల్లర్‌ నిలబడటానికి సిమెంట్‌, సపోర్ట్‌ ఇచ్చింది ఆయనే. ఈ చిత్రం వైల్డ్‌ ఫైర్‌ లాంటిది. ఈ ఫైర్‌ని ఆపడం.. చాలా కష్టం’’ అని అన్నారు.

ఇంతకన్నా మంచి పరిచయం ఉండదు: సంయుక్తా మీనన్‌
సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ ‘‘ఇది మా సినిమా అని చెప్పడం కంటే పవన్‌కల్యాణ్‌గారి సినిమా అంటేనే అందరి సినిమా అవుతుంది. ఇంతటి ఘన విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. నిన్న ఒక మాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. ప్రతి సీన్‌కి నేను కూడా కేకలు, ఈలలు వేశా. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి ఉండదని నమ్ముతున్నా’’ అన్నారు.

ప్రియంక మాట్లాడుతూ ‘‘
హరిణీగా నేను చేసిన కానిస్టేబుల్‌ పాత్రకు మంచి స్పందన వస్తోంది. నటన బావుంది అంటూ ప్రశంసిస్తున్నారు. హరిణి పాత్ర కోసం నన్ను సెలెక్ట్‌ చేసి అవకాశం ఇచ్చిన నాగవంశీగారికి కృతజ్ఞతలు. కెరీర్‌ ప్రారంభంలో ఇలాంటి అవకాశం రావడం ఎప్పటికీ మరచిపోలేని విషయం’’ అని ప్రియంక చెప్పారు.

గేయ రచయిత రామజోగయ్య శాస్ర్తి మాట్లాడుతూ ‘‘బెనిఫిట్‌ షో నుంచి ‘భీమ్ల్లానాయక్‌’ ప్రభంజనంలా దూసుకెళ్తోంది. ఇంత మంచి విజయంలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలు’’ అని చెప్పారు.