‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్*

506

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఉత్సవంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ “ఆర్ట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా ‘ఆర్య’. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు నేను వేసిన సెట్స్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ” అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా నాన్న అల్లు రామలింగయ్య గారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ‘శంకరాభరణం’కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “నేను వైజాగ్ లోనే చదువుకున్నా. వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్. శ్రీశ్రీ, చలం గారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రి గారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది. ఈ సినిమాని తన భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చిన తమన్ కు థాంక్స్. విలువలతో సినిమా తియ్యండి, మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. పూజా హెగ్డే, టబు గారు, నివేదా పేతురాజ్, రోహిణి గారు పోషించిన గౌరవప్రదమైన స్త్రీ పాత్రల్ని మేం గుండెల్లో పెట్టుకుంటామని వాళ్లను ప్రేమించి ఈ సినిమాని మీరంతా అంత ముందుకు తీసుకువెళ్లారు. మీ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా.