మనంసైతం’ కాదంబరి కిరణ్‌కు అవార్డు

64

▪️ ‘మనంసైతం’ సేవ‌ల‌ను గుర్తించిన రోటరీ క్లబ్
▪️ రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో స‌త్కారం
▪️ FNCC లో ఘనంగా జరిగిన అవార్డు కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్: ‘మనంసైతం’ అంటూ ప‌దేళ్ల పైగా నిరంత‌రం సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. హైద‌రాబాద్ ఎఫ్ఎన్‌సీసీలో జ‌రిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుక‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును కాదంబ‌రి కిర‌ణ్‌కు అందించి,స‌త్క‌రించారు. కాదంబ‌రి కిర‌ణ్ చేస్తున్న సేవలు అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని, పేద‌ల పాలిట క‌నిపించే దేవుడ‌ని శ్రీ బుర్ర వెంకటేశం కొనియాడారు. రోట‌రీ క్ల‌బ్ హైద‌రాబాద్ ఈస్ట్ జోన్ నిర్వ‌హ‌కులు సీవీ సుబ్బారావు, సుదేష్ రెడ్డి, Tnm చౌద‌రీ మాట్లాడుతూ.. కాదంబ‌రి కిర‌ణ్ ప‌దేళ్లుగా చేస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. సేవ‌రంగం నుంచి కాదంబ‌రి కిర‌ణ్‌, సినిమారంగం నుంచి జయసుధ, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్ట‌ర్ సాయిపద్మ అవార్డ్స్ అందుకున్న‌వారిలో ఉన్నారు.

ఈ సందర్బంగా ‘మనంసైతం’ కుటుంబం నుంచి కాదంబ‌రి కిర‌ణ్ చేస్తున్న సేవ కార్య‌క్ర‌మాల‌ను చూపించే ప్ర‌త్యేక వీడియోను ప్ర‌ద‌ర్శించారు. కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ”ఐశ్వర్యం అంటే మనిషి కి సాటి మనిషి తోడుండటం. ఇతర జీవులు తోటి జీవులకు సాయపడుతాయి. కానీ మ‌నిషి మాత్రం త‌న జీవిత‌మంతా తన వారసులు మాత్ర‌మే తన సంపాదన అనుభవించా లని ఆరాట‌ప‌డుతాడు. ఒక‌రికొక‌రం సాయం చేసుకోక‌పోతే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. కరోనా సమయంలో 50 వేల మంది నిస్సాహ‌యుల‌కు సాయం చేశాం. అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ( సపర్య we care for uncared )ప్రారంభించి వారికి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. పేదల‌కు సేవ చేస్తే చిన్నపిల్లల కాళ్ళు అయినా మొక్కుతా.. లేదంటే పరమ శివుడినైనా ఎదురిస్తా” అని ఈ సంద‌ర్భంగా అన్నారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం కుటుంబం అండ‌గా ఉంటుందని కాదంబ‌రి కిర‌ణ్ చెప్పారు.