మెట్రో స్టేషన్ లో ఆరోగ్య కేంద్రాలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎల్. బి. నగర్ స్టేషన్ లో ప్రారంభం

73

దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ లలో ఆరోగ్య సేవలు అందుబాటులో రావడం సంతోషం గర్వకారణం అని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మిట్టా ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్. బి. నగర్ మెట్రో స్టేషన్ లో పాలీ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్య అతిధిగా మెట్రో రైలు లో ప్రయాణించి విచ్చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణీకులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని ఆమె అన్నారు. మొదటిసారిగా హెల్త్ ఎటిఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపి, టెలి మెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ మెట్రో స్టేషన్ లో ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం దేశంలోనే రికార్డు అని గద్వాల్ విజయలక్ష్మి వివరించారు. ఇబ్రహీంపట్నం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది ప్రయాణించే మెట్రో ట్రైన్స్ లో ఎలాంటి అనారోగ్యానికి గురైనా వెంటనే ఎమర్జన్సీ క్లినిక్స్ స్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపు ఆదర్శనీయం అన్నారు. మిట్టా ఎక్స్ లెన్స్ చైర్మన్ డా. మిట్టా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎల్. బి. నగర్ లో తొలి క్లినిక్ ప్రారంభించామని, త్వరలో మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్స్ లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వంద మెట్రో కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ఎనీమియా ముక్త భారత్ పిలుపులో భాగంగా తాము ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విజన్ చెక్, ఆడియోమెట్రి లాంటి 21 టెస్టులు ఉచితంగా చేయనున్నట్లు మిట్టా శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మిట్టా ఎక్స్ లెన్స్ డైరెక్టర్లు డాక్టర్ నిఖిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ నిఖిత రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.