Review:1948 – అఖండ భారత్

433


దేశ విభజన తరువాత జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 1948 – అఖండ భారత్. మర్డర్ ఆఫ్ మహాత్మ అనునది ఉపశీర్షిక. మహాత్మ గాంధీ హత్యా నేపధ్యంలో… చరిత్రాత్మక సంఘటనలను ఆధారంగా చేసుకొని గాంధీ హత్యపై పూర్తి సమాచారంతో సమగ్రంగా… తెరకెక్కిన చిత్రం ఇది. గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుండి జరిగిన యధార్థ వాస్తవాల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి డా.ఆర్య వర్ధన్ రాజ్, కథ, కథనం, మాటలు, రీసెర్చ్ లను అందించారు. కొత్త దర్శకుడు ఈశ్వర్ బాబు.డి దర్శకత్వం వహించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై .మహర్షి ఈ చిత్రాన్ని ఎం.వై .ఎం క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈచిత్రం ఇటీవలే విడుదల అయింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

సినిమా కథేంటి: దేశ విభజన అనంతరం మహాత్మాగాంధీ( రఘు నందన్) దేశంలో మతకలహాలు ఆగిపోవాలని, అలాగే పాకిస్తాన్ కి భారత ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.55 కోట్లు ఇవ్వాలని ఢిల్లీ లోని బిర్లా హౌస్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. అలా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కొంతమంది హిందూ మహాసభ సభ్యులకు నచ్చదు. అందులో ముఖ్యంగ నాధూ రామ్ గాడ్సే (ఆర్య వర్ధన్ రాజ్) , నారాయణ ఆప్టే(దుర్గా ప్రసాద్), సుహాస్ – విష్ణు కర్కరే (సుహాస్), మదన్ లాల్ పహ్వ (నవీన్ మాదాసు), డా.పర్చూరేయ్ (నాగరాజు నన్నపనేని) లాంటి అభ్యుదయ యువకులు వీర సావర్కర్ అధ్వర్యంలో గాంధీ చర్యలను వ్యతిరేకించి… ఆయనను ఎలా చంపాలి అని 45 రోజుల ముందు నుంచి వేసే స్కెచ్ యే మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: గాంధీని ఎవరు చంపారు అన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలు గాడ్సే తన కోర్ట్ స్టేట్మెంట్ లో 150 పాయింట్స్ గా చెప్పినా… అప్పటి ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా నిషేదించిందని ఈచిత్రానికి కథ కథనం, మాటలు రాసిన ఆర్య వర్ధన్ రాజ్… ఇందులో చూపించారు. అలాగే గాడ్సే శవాన్ని దహనం చేసిన ప్రదేశం సైతం ఎవ్వరికి తెలీకుండా అతని చరిత్రని ముగించడం కోసం చేసిన కుట్రలు, అతని ప్రతిష్టని దిగజార్చిడానికి పన్నిన కుటిల రాజకీయాల నేపథ్యం తదితర విషయాలన్నింటినీ ఎంతో పరిశోధించి ఈ తరం యూత్ కి అర్థమయ్యేలా చూపించారు. గత 74 సంవత్సరాలుగా దాచిపెట్టబడిన నిజాలను వెలికితీసే అంశాలతో ఓ చరిత్రాత్మక కథగా ఈ చిత్రాన్ని తెరమీద ఆవిష్కరించి… రచయత ఆర్య వర్ధన్ రాజ్, దర్శకుడు ఈశ్వర్ బాబు విజయం సాధించారు. గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుండి జరిగిన యదార్ధ సంఘటనలు, గాంధీ హత్య… హత్యానంతరం పరిణామాలు… హత్యానంతరం నిందితుల గాలింపు… వారి తాలూకు ఇన్వెస్టిగేషన్… ఇంట్రాగేషన్, నాథురాం గా డ్సే కోర్ట్ వాదన, ఆయన, ఆయనకి సహకరించిన నారాయణ ఆప్టే ఉరితీత… తదితర అంశాలన్నీ ఎంతో హృద్యంగా చిత్రీకరించి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ముగించాడు.

ఈ చిత్రంలో గాంధీ పాత్రలో రఘనందన్ (Raghu Nandhan) బాగా ఆకట్టుకున్నాడు. హావ భావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా కుదిరాయి. ఇక కీలక రోల్ నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz) అలరించాడు. ఎందుకంటే ఈ పాత్రకి గాంధీ లాగ పెద్దగా రిఫరెన్స్ కూడా మనకి చరిత్రలో కనిపించవు. గాంధీని హత్య చేసిన హంతకుడిలాగే మనం చదవడం కానీ, వినడం కానీ చేశాం. ఇందులో అయితే గాడ్సే ఓ అభ్యుదయ భావాలు వున్న బ్రాహ్మణ యువకునిగా గాడ్సే ఎంత అగ్రెసివ్ గా ఉండేవారో ఆర్య వర్ధన్ రాజ్ బాగా చేసి చూపించారు. క్లైమాక్స్ కోర్ట్ సీన్ లో భావోద్వేగంతో చెప్పిన డైలాగులు చాలా కన్వెన్సింగ్ గా వున్నాయి. నారాయణ అప్టే పాత్రధారి బాగా చేసాడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈచిత్రానికి కథ… కథనం రాయడానికి రచయిత, నటుడు ఆర్య వర్ధన్ రాజ్
సుమారు 11372 పేజీల రీసెర్చ్ పేపర్స్ … 300కు పైగా పుస్తకాలు… 15 వేల కిలోమీటర్లు తిరిగి, 750 కు పై చిలుకు వ్యక్తులను కలిసి ,రెండు సంవత్సరాలు కష్టపడి, యధార్థ సంఘటనల ఆధారంగా 152 సీన్స్ తో బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి… కొత్త దర్శకుడు ఈశ్వర్ డి. బాబు తో కలసి ఈ చిత్రాన్ని తెరమీద ఆవిష్కరించడం బాగుంది. అలాగే నిర్మాత M.Y. మహర్షి ఈ సినిమాకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ తో 1948ని మళ్ళీ రీ క్రియేట్ చెయ్యడానికి 700 ప్రాపర్టీస్ ని తయారుచెయ్యడమే కాకుండా, 500కు పైగా కాస్ట్యూమ్స్ ను పూర్తిగా ఖాదీ వస్త్రాన్ని మాత్రమే వుపయోగించి డిజైన్ చేయించారు. దాంతో సినిమా చాలా నాచురల్ గా వుంది. చెన్నై కి చెందిన చంద్ర శేఖర్ సినిమాటోగ్రఫీ ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టేలా వుంది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం బాగా కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ వీకెండ్ లో తప్పక చూడండి.

రేటింగ్: 3/5