అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం.. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం

557


హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జూలై 4, 2022 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్‌ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు-నిర్మాత ఆదిశేషగిరి రావు, సినీనటుడు మోహన్‌ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరి లేకపోతే మనలో ఆ తెగింపు రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా దేశం కోసం పోరాటం చేసిన తెలుగు వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న రాంజీ గోండ్ మ్యూజియాన్ని త్వరగా పూర్తి చేయాలన్న ఆయన విశాఖ లంబసింగిలో కడుతున్న మ్యూజియాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న అల్లూరి సీతారామరాజు సొంత గ్రామం మొగల్లు వెళుతున్నామన్నారు. హైదరాబాద్ లో అల్లూరి మ్యూజియానికి రూ.18 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కోటి రూపాయలు విడుదల చేసిందన్నారు. ఢిల్లీ లో తెలుగువాడి చరిత్ర తెలియడానికి విజ్ఞాన భవన్‌లో అద్భుత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో అల్లూరి పుట్టి ఉంటే 24 ఎకరాలు కేటాయించే వాళ్లమని, దానిలో మ్యూజియం ఏర్పాటు చేసేవార‌మ‌ని చెప్పారు. దక్షిణాది వాడు, తెలుగు వాడైనందునే సీతారామరాజుపై కేంద్రం వివక్ష‌ చూపుతోందని విమర్శించారు. పార్లమెంట్ లో ఆయన విగ్రహం కూడా లేదన్నారు. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి కొంపల్లిలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ తన అల్లూరి సీతారామరాజు చిత్ర విశేషాలు నెమరు వేసుకున్నారు.తన నా చిన్న తనంలో అగ్గి రాముడు సినిమా చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందని తెలిపారు. తాను నటుడు కాక ముందు నుంచి అల్లూరి గురించి బుర్రకథలు రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చానని. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివానని అన్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా అని ఎదురు చూశా, ఎవరూ సీతారామరాజు చరిత్రని పూర్తిగా తెరకెక్కించడం లేదు అని బాధపడేవాడిని. హీరో అయ్యాక ఎన్నో చిత్రాలు చేశా కానీ ఒక గొప్ప చిత్రం తీయాలనే కోరిక ఉండేది. నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎంచుకుని నేనే నిర్మించానాని అన్నారు. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే అని కృష్ణ అన్నారు. నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికి అల్లూరి సీతారామరాజే అని కృష్ణ తెలిపారు. ఏడాది పాటు ఆ చిత్రం ప్రేక్షకులను అలరించింది అని కృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు మోహ‌న్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు గ్రామానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. త్వ‌ర‌లో అల్లూరు గ్రామానికి తాను వచ్చి అవంతి ఏమి చేశారో చూస్తానని మోహన్ బాబు తెలిపారు. తాను రూ.300 జీతానికి అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. అందరి సహాయం చేసే వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని కొనియాడారు. సౌత్ ఇండియా అంటే ఏమిటి..? నార్త్ ఇండియా అంటే ఏమిటి? గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ప్రధాని మోదీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు మోహన్ బాబు.

PRO;SURESH KONDATI